కలం, మునుగోడు : రేవల్లి నరేష్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ (Palle Ravikumar Goud) అన్నారు. సోమవారం చండూరు మండల పరిధిలోని బోడంగి పర్తి గ్రామంలో నరేష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసం ప్రజల కోసం అండగా ఉండడమే అన్నారు. నరేష్ ఎల్లప్పుడు పేద ప్రజల కోసం నిరంతరం పోరాడేవారని కొనియాడారు. అనంతరం నరేష్ అంతిమయాత్రలో రవికుమార్ పాడే మోశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మర బోయిన వెంకన్న, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, సరికొండ నరేష్, మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న యాదవ్, గ్రామ సర్పంచ్ బొమ్మల శంకర్, ఉప సర్పంచ్ సరికొండ ముత్యాల గౌడ్, బిజెపి నాయకులు బొమ్మరబోయిన రాజు, వరికుప్పలగిరి తదితరులు పాల్గొన్నారు.

