కలం, చండూరు : రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మునుగోడు (Munugode) మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం చండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ గోదాం కూడా తమ పోరాట ఫలితమేనన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ప్రారంభం కాలేదనిన్నారు.
ఎమ్మెల్యే మాత్రం 15 రోజులలో పనులు ప్రారంభిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చౌటుప్పల్ ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి 80 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు రైతు అవసరాలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ప్రచార రాజకీయాలకు పరిమితమయ్యారని ఆయన దుయ్యబట్టారు.
రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని, మునుగోడు ప్రజల హక్కుల కోసం ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకట్ రెడ్డి, బొమ్మర బోయిన వెంకన్న, పెద్ద గోని వెంకన్న, కొత్తపాటి సతీష్, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, నేర్మట సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, తదితరులు పాల్గొన్నారు.

