కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కరీంనగర్ (Karimnagar) బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రం చింతకుంటలోని పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని(BRS Foundation Day) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ అవసరమని భావించి టీఆర్ఎస్ పార్టీ స్థాపించబడిందని, ఆ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడిందని తెలిపారు. అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధి పరంగా దేశంలో ముందంజలో నిలిపారని పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నలువాల పుష్పలత-రవీందర్, అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

