కలం, వెబ్ డెస్క్: తమ పార్టీ నేతలకు సంబంధించిన డీప్ఫేక్ వీడియోలను (Deepfake videos) సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తప్పుడు వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
డీప్ఫేక్ వీడియోలపై ఫిర్యాదుకు సిద్ధం
బీఆర్ఎస్ నేతలు(BRS leaders), ఎమ్మెల్యేలకు(MLAs) సంబంధించిన వీడియోలను మార్ఫింగ్ చేసి లేదా డీప్ఫేక్ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో (Social Media) సర్క్యులేట్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసి తమ వాదనను వివరించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీల సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసన
మరోవైపు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ల సస్పెన్షన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ విధించడం సరికాదని మండిపడ్డారు. తమ వాదన వినిపించేందుకు అవకాశం కల్పించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్సీల సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

