హర్యాణాలో బ్రెజిల్ మోడల్‌కు ఓటు.. రాహుల్ సంచలన ఆరోపణ

ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల దొంగలను ఈసీ కాపాడుతోందని.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు. హరియాణా(Haryana) ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్‌ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. హరియాణా ఎన్నికల్లో బీజేపీ నేతలు అనేక అధికార యంత్రాంగాలను వినియోగించి సుమారు 25 లక్షల ఓట్లను చోరీ చేశారని రాహుల్‌ ఆరోపించారు. మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 12.5 శాతం నకిలీఓట్లు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా, “బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌(Brazil model)కి ఒకే ఫొటోతో సీమా, స్వీటీ, సరస్వతి వంటి పేర్లతో 22 ఓట్లు సృష్టించారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరియాణాలో 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని, ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీదేనని రాహుల్‌ అన్నారు. ఫేక్‌ ఫొటోలతో లక్షకు పైగా ఓట్లు, ఒకే ఫొటోతో రెండు బూత్‌లలో 223 ఓట్లు, తప్పుడు చిరునామాలతో 93 వేల ఓట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎన్నికల సమయంలో కొన్ని వ్యక్తుల పేర్లను కావాలనే జోడించారని ఆరోపించారు.

“అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ గెలుస్తుందని సూచించాయి. కానీ, ఈ నకిలీ ఓట్ల వల్లే ఫలితాలు తారుమారయ్యాయి” అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల కమిషన్‌ నిద్రపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. “డూప్లికేట్‌ ఓటర్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఈసీ వద్ద ఉంది. అయినా ఐదు లక్షల నకిలీ ఓటర్లు ఎలా చొరబడ్డారు? ఈసీ కోరితే కేవలం సెకన్లలోనే నకిలీ ఓట్లను తొలగించగలదు. కానీ, భాజపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

యూపీలో ఓటు వేసిన వేలాది మంది హరియాణాలోనూ ఓటు వేశారని, భాజపా నేతల చిరునామాలతో వందల నకిలీ ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్‌(Rahul Gandhi) ఆరోపించారు. “భాజపాకు చెందిన వాళ్లకు దేశమంతా ఓటు వేసే హక్కు ఉందా?” అని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: జూబ్లీహిల్స్.. బైపోల్స్‌లో వారి ఓట్లే కీలకం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>