కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా కోర్టు (Warangal Court)కు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో హనుమకొండలోని కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ బెదిరింపు సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజల్ టీం, పోలీసులు కోర్టు పరిసరాలలో తనిఖీ చేపట్టారు.
అడుగడుగునా పరిశీలిస్తూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కోర్టుకు వచ్చిన న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కోర్టు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అనుమానాస్పద వస్తువులు, పరిసరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

