కలం, వెబ్ డెస్క్: 2026 టీ20 వరల్డ్ కప్లో పాల్గొనకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బాయ్కాట్ వెనుక దౌత్యపరమైన వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణకు బంగ్లాదేశ్ (Bangladesh) క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా ఆడబోమని గతంలో బీసీబీ ప్రకటించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరగా, అందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీనివల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం దక్కింది.
వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్కు దూరం కావడం దేశ క్రీడా దౌత్యానికి జరిగిన నష్టంగా కొత్త క్రీడల మంత్రి అమీనుల్ హక్ భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను విచారణ కమిటీ తేల్చనుంది. కేవలం వరల్డ్ కప్ అంశమే కాకుండా, గత బీసీబీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై కూడా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఐసీసీతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
క్రీడలు దేశాన్ని ఏకం చేసే వేదికలని, భవిష్యత్తులో ఇలాంటి దౌత్యపరమైన పొరపాట్లు జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో బోర్డు నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని, ఇకపై పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈద్ పండుగ తర్వాత ఈ విచారణ కమిటీ అధికారికంగా తన పనిని ప్రారంభించనుంది.

