కలం, వెబ్ డెస్క్: జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా (Peddi Movie) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పైరసీ మూవీ లింక్ను బొలిశెట్టి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా పెద్ది సినిమా చూసినట్లు తెలిపారు. సినిమా టికెట్లను కూడా ఈ పోస్టుకు జత చేశారు. అయితే పెద్ది సినిమా ఆన్లైన్లో పైరసీ అయిపోయిందని, ఇది అందరికీ అందుబాటులో ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలా విడుదలైన కొద్ది రోజులకే పైరసీ బారిన పడటం నిర్మాతతో పాటు ప్రభుత్వానికి కూడా తీరని నష్టమన్నారు.
పైరసీని అరికట్టే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, హోం మినిస్టర్ అనిత దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనిపై దృష్టి సారించి సత్వరమే ఈ మూవీని ఆన్లైన్లో నుంచి తొలగించాని కోరారు. సామాజిక సందేశంతో వచ్చిన పెద్ది లాంటి సినిమా విడుదలైన వెంటనే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పైరసీ వినోదం కాదని, అది దొంగతనమని, అది నిర్మాతల పెట్టుబడి అని, సినీ కార్మికుల ఉపాధిని, ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుందని చెప్పారు. పైరసీ వెబ్సైట్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే తీసుకున్న చర్యల గురించి ప్రజలకు వెల్లడించాలని బొలిశెట్టి తన పోస్టులో పేర్కొన్నారు.

