కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill) పై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకున్నాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 17 మహిళలకు చీకటి రోజుగా నిలిచిందని విమర్శించారు. మహిళలకు న్యాయం చేసే చట్టాన్ని అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ తన వైఖరిని మరోసారి బయటపెట్టిందని అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ సహకరించలేదని ఆరోపించారు.
హుజురాబాద్లో (Huzurabad) బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టిన కార్యకర్తలు కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఇక కరీంనగర్ (Karimnagar) తెలంగాణ చౌక్ వద్ద కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును వ్యతిరేకించడం కాంగ్రెస్ వైఖరిని బహిర్గతం చేసిందని అన్నారు.
మహిళల పట్ల కాంగ్రెస్కు నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అదే విధంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ మహిళల అభివృద్ధికి అడ్డుపడిందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: బీజేపీ బ్రహ్మాస్త్రానికి బ్రేక్ వేసిన ‘ఇండియా’
Follow Us On: X(Twitter)

