కలం, కరీంనగర్ బ్యూరో : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బీజేపీ కి ఉన్న రిపోర్టు, అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సాధిస్తుందని.. అంచనాలకు మించిన ఫలితాలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ (MP Laxman) ధీమా వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లోని గణేష్ నగర్ బైపాస్ రోడ్డులో గల అదితి హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికేలా ఈ నెల 10న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈనెల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేలా ఈనెల 10న, “జనాగ్రహ సభ”ను నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) హాజరయ్యే ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతారని, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఆయన (MP Laxman) ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఎలా నడపాలో అర్థం కాని స్థితిలో పాలన కొనసాగిస్తుందన్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఆ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్లో మేయర్గా బీజేపీ అభ్యర్థి గెలవడం ప్రజల్లో మార్పు సంకేతమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీపై ఎనలేని విశ్వాసం ఉందని, రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయమని డా.లక్ష్మణ్ స్పష్టం చేశారు. సమావేశంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు కళ్యాణ్, తదితరులున్నారు.
Read Also: మే చివరి నాటికి 2BHK ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి: పొంగులేటి
Follow Us On: Instagram

