కలం, వెబ్ డెస్క్: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) హౌస్ అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA Venkataramana Reddy) ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరుతుండగా, పోలీసులు మేడ్చల్లో ఇంటి వద్దనే అడ్డుకున్నారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి నేతృత్వంలో భారీగా పోలీసులు ఈటల ఇంటికి చేరుకొని గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో ఈటల నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళ్తున్న తనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ.. ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు. పోలీసుల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఈటల రాజేందర్ (Eatala Rajendar) అన్నారు.
Read Also: ట్రంప్ టారిఫ్ల రద్దుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
Follow Us On: Pinterest


