కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.వేణుగోపాల్ మంగళవారం సుజాతనగర్లోని ఎంఎస్ సూర్య గ్యాస్ ఏజెన్సీ గోదాం, కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్, పంపిణీ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్ సిలిండర్లను సీనియారిటీ క్రమంలోనే పారదర్శకంగా అందజేయాలని స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. గ్యాస్ సరఫరాలో ఆలస్యం, అక్రమాలు, ఫిర్యాదులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత విభాగాల అధికారులు, ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

