కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులో మరో విషాదం చోటుచేసుకుంది. వంట విషయంలో మొదలైన గొడవ, చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. 35 ఏళ్ల సుష్మ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Bengaluru Techie) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గతంలో ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీలో పనిచేసిన ఆమెకు, పునీత్ కుమార్ అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
వంట చేసే విషయంలో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరగడం, అది మనస్తాపానికి గురిచేయడంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం గొడవ మాత్రమే కాకుండా, దీని వెనుక వరకట్న వేధింపులు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వారం వ్యవధిలోనే బెంగళూరులో ఇద్దరు టెకీలు ఆత్మహత్య చేసుకోవడం ఐటీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

