కలం, మహబూబ్నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును భారీగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీసీ సమాజ్ (BC Samaj) రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, ఈ పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో రూ.200 ఉన్న ఫీజును ఏకంగా రూ.1,000 కు పెంచిందని మండిపడ్డారు. కొత్తగా నోటిఫికేషన్స్ వేసి రూ.1,000 ఫీజును నిర్ణయించి నిరుద్యోగ యువతకు మోయలేని భారాన్ని పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి నయా పైసా తీసుకోబొమని అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రకటించి ఈరోజు నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటూ, కోచింగ్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు ఫీజు పెంపు గుదిబండలా మారిందని అన్నారు. నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే పెంచిన జాబ్ అప్లికేషన్ ఫీజును తగ్గించాలని శ్రీనివాస్ సాగర్ కోరారు.

