కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంట (Bathukamma Kunta) భూమి వివాదం కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, గ్రిల్స్, శిలాఫలకాలను హైడ్రా (HYDRA) అధికారులు స్వయంగా తొలగిస్తున్నారు. ఈ భూమిపై కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలోనే కోట్ల రూపాయలు వెచ్చించి సుందరీకరణ పనులు చేపట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులను అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమిపై స్టేటస్ కో అమల్లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఎలా చేపడతారని అధికారులను ప్రశ్నించింది. వెంటనే బోర్డులు తొలగించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో హైడ్రా అధికారులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం సైతం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని స్పష్టం చేయడంతో హైడ్రా చర్యలు చేపట్టింది.

