కలం, వెబ్ డెస్క్: ఫుట్బాల్ (Football) అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 2029 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ (UEFA Champions League) ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు స్పానిష్ క్లబ్ ఎఫ్సీ బార్సిలోనా (Barcelona) అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను యూఈఎఫ్ఏకు సమర్పించినట్లు క్లబ్ యాజమాన్యం తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనను బార్సిలోనా సిటీ కౌన్సిల్, కాటలోనియా ప్రభుత్వంతో కలిసి సిద్ధం చేశారు.
అలాగే రాయల్ స్పానిష్ ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా ఈ బిడ్కు పూర్తి మద్దతు ప్రకటించింది. యూఈఎఫ్ఏ కోరిన అన్ని రకాల సాంకేతిక, చట్టపరమైన అవసరాలతో కూడిన పత్రాలను తాము సమర్పించినట్లు బార్సిలోనా క్లబ్ పేర్కొంది. ఈ మెగా ఈవెంట్ను నిర్వహించే పూర్తి సామర్థ్యం తమ స్పాటిఫై క్యాంప్ నౌ స్టేడియంతో పాటు బార్సిలోనా నగరానికి ఉందని ఈ పత్రాల ద్వారా స్పష్టం చేశారు. ఈ నివేదిక సమర్పణతో బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు నిర్ణయం యూఈఎఫ్ఏ చేతుల్లోకి వెళ్లింది.
వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, ఏ వేదికను ఎంపిక చేయాలనే దానిపై యూఈఎఫ్ఏ త్వరలోనే సమీక్ష మొదలుపెట్టనుంది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో 2029 ఫైనల్ మ్యాచ్ వేదికను అధికారికంగా ప్రకటిస్తారు. గతంలో పెద్ద పెద్ద అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించిన అనుభవం బార్సిలోనా నగరానికి ఉంది. యూరప్లోనే అత్యధిక సామర్థ్యం ఉన్న క్యాంప్ నౌ మైదానాన్ని యూఈఎఫ్ఏ ఎప్పుడూ టాప్ కేటగిరీ స్టేడియంగానే గుర్తిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేడియంలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
ఈ పనులు పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక క్రీడా వేదికగా మారుతుందని, అందువల్ల ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కు ఇది సరైన వేదిక అవుతుందని క్లబ్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల హంగేరిలోని బుడాపెస్ట్ నగరం మే 30 శనివారం నాడు పుస్కాస్ ఎరీనాలో 2025/26 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. పారిస్ సెయింట్ జెర్మైన్, ఆర్సెనల్ జట్ల మధ్య ఈ చారిత్రాత్మక మ్యాచ్ జరిగింది. హంగేరి దేశం ఒక యూరోపియన్ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.

