కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) మెగా టోర్నీలో తమ మొదటి మ్యాచ్ ఆడటానికి దక్షిణాఫ్రికా (South Africa) జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆ జట్టు మేనేజర్ హ్యూగో బ్రూస్ ప్రకటించారు. సహ ఆతిథ్య దేశమైన మెక్సికోతో శుక్రవారం జరగబోయే ఈ మ్యాచ్ కోసం తమ ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. మైదానంలో ఉండే హోరును చూసి భయపడకుండా, కేవలం మ్యాచ్ గెలవడం పైనే దృష్టి పెట్టాలని ఆటగాళ్లకు సూచించారు. సొంత దేశంలో మ్యాచ్ జరుగుతోంది కాబట్టి మెక్సికో జట్టుకు స్థానిక ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా ఉంటుందని బ్రూస్ అంగీకరించారు.
ఆ జట్టులో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల మంచి ఆటగాళ్లు ఉన్నారని గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, తాము మంచి ఫలితాన్ని సాధిస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. సౌతాఫ్రికా, మెక్సికోలతో పాటు సౌత్ కొరియా, చెక్ రిపబ్లిక్ జట్లు కూడా గ్రూప్-ఎ లో ఉన్నాయి. ఇలాంటి కఠినమైన గ్రూప్లో ఉన్నప్పుడు టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యమని బ్రూస్ నొక్కి చెప్పారు.
తొలి మ్యాచ్లోనే విజయం సాధించకపోతే ఆ తర్వాత ముందడుగు వేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సముద్ర మట్టానికి దాదాపు 2,200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే మెక్సికో సిటీ వాతావరణానికి అలవాటు పడటానికి దక్షిణాఫ్రికా జట్టు 10 రోజుల ముందే అక్కడికి చేరుకుంది. తమ సన్నాహాలన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగాయని, తమ జట్టు మ్యాచ్కు పూర్తిగా సిద్ధమైందని బ్రూస్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2010 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కూడా ఇవే రెండు జట్లు తలపడి 1-1తో మ్యాచ్ను డ్రా చేసుకున్నాయి.
అలాగే 1986 ప్రపంచకప్లో ఇదే వేదికపై తాను ఆటగాడిగా మెక్సికో ప్రస్తుత కోచ్ అగ్యురేతో తలపడిన విషయాన్ని బ్రూస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు 87,000 మంది మెక్సికో అభిమానుల ముందు ఆడటం పెద్ద సవాలేనని బ్రూస్ అన్నారు. అయితే స్టేడియంలోని అభిమానులు కేవలం అరుస్తూ, డ్యాన్స్ చేస్తారే తప్ప మైదానంలోకి వచ్చి ఆడరని చెప్పారు. తాము కేవలం ఆటపైనే దృష్టి పెట్టి, ఆ శబ్దాలకు ప్రభావితం కాకుండా ఉంటే రేపటి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయగలమని బ్రూస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

