కలం, కరీంనగర్ బ్యూరో : నిన్న రాత్రి కురిసిన భారీ గాలివాన కరీంనగర్ (Karimnagar) నగరంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. బొమ్మకల్ ఐదో వార్డు పరిధిలోని వడ్డెర కాలనీలో గాలివాన బీభత్సం సృష్టించింది. అక్కడ నివసించే గండికోట రాజేశ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay).. కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి హుటాహుటిన వడ్డెర కాలనీని సందర్శించారు. బాధితులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఇల్లు కోల్పోయిన రాజేశ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో ప్రమాదకరంగా మారిన భారీ హోర్డింగ్ ల పటిష్టతను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
మరోవైపు గాలివాన కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై బండి సంజయ్ (Bandi Sanjay) ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పరస్పర విమర్శలకే పరిమితమవుతోందని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుకు అవసరమైన నిధులు సకాలంలో అందిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని నిరూపిస్తూ లేఖ రాసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. బీజేపీ నిరంతర ఆందోళనల వల్లే ప్రస్తుతం అంతో ఇంతో వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Read Also: ములుగు కేసు సంచలనం.. నిందితుడు తరుణ్ కోసం పోలీసులు గాలింపు
Read Also: డిజిటల్ విప్లవం

