కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ విలీనంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ చర్చలు జరిగాయని.. ప్రతి రెండవ మంగళవారం డిపో స్థాయి నుండి మంత్రి వరకు వారి సమస్యలపై కార్మికులు నేరుగా కలవవచ్చని సూచించారు. డీఎంలు, ఆర్ఎంలు, ఇతర ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలపై చర్చిస్తారని తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించి, అనంతరం సంఘాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గుర్తింపు సంఘాల ప్రతినిధులు, అధికారులతో విలీనానికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పడుతుందని.. విలీన ప్రక్రియ ప్రారంభం (Telangana RTC Merger Process) అవుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో విలీనం తర్వాత అనేక అంశాలు బయటకు వస్తున్నాయని.. కొన్ని సమస్యలు కూడా బయటకి వచ్చాయని మంత్రి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు ఉండదని తెలంగాణ ప్రభుత్వం విలీన ప్రక్రియ చేయాలని భావిస్తుందని వివరించారు. గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగితే గుర్తింపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు, అధికారులు విలీన ప్రక్రియను ప్రారంభిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలిపారు. కొత్త నియామకాలు, కొత్త బస్సుల ప్రవేశంతో ఆర్టీసీ దేశంలోనే ఉత్తమ సంస్థగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లి డిపోలో 60 ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
Read Also: కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి: హరీష్ రావు
Follow Us On : WhatsApp

