తెలంగాణ, కరీంనగర్ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఈ నెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కొండగట్టుకు కాలినడకన వెళ్తున్నారు. కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ గెలిస్తే పార్లమెంట్ పరిధిలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడక వచ్చి మొక్కులు తీర్చుకుంటానని బండి సంజయ్ (Bandi Sanjay) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
ఇందులో భాగంగా బీజేపీకి చెందిన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఈ మహా పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.

