కలం, నల్లగొండ బ్యూరో : సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సర్వమతాలను సమానంగా చూస్తూ, అందరి అభివృద్ధికీ నిరంతరం కృషి చేస్తున్నది కూడా కాంగ్రెస్ మాత్రమేనన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మొదలు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వరకు ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ నిరంతరం పనిచేస్తోందనిచెప్పారు.
ముస్లింల రక్షణతో పాటు వాళ్ల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద పీట వేశాయని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొనడడం ఆనందంగా ఉందన్నారు. ముస్లింల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మంత్రిగా నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో షాదీఖానా, కమ్యూనిటీ హాల్, ఖబరస్తాన్ వంటి సమస్యలను సత్వరమే పరీష్కరిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదితా లక్షాది, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

