కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్ ఐటీ కంపెనీలో వెలుగుచూసిన వేధింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇలాంటి కార్పొరేట్ జిహాద్, మతపరమైన వేధింపులు, బలవంతపు మార్పిడి ప్రయత్నాలపై మౌనంగా ఉండకూడదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నాసిక్ ఘటన తర్వాత తెలంగాణ సమాజం మౌనంగా ఉండకూడదని, హైదరాబాద్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఐటీ కార్యాలయాలు కేవలం కెరీర్ నిర్మించుకునే వేదికలుగా ఉండాలని, అక్కడ ఎటువంటి వేధింపులు, మతపరమైన వివక్ష, దోపిడీ లేదా ఒత్తిడికి తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించి ప్రముఖ ఐటీ కంపెనీల అధినేతలు, హెచ్ఆర్ బృందాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. ఐటీ రంగంలో కఠినమైన జవాబుదారీతనాన్ని తీసుకురావాలని, ఏ ఒక్క ఉద్యోగి ఫిర్యాదును కూడా తొక్కిపెట్టకూడదని ఆయన హెచ్చరించారు. బాధితులు ఒంటరి కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని, సోషల్ మీడియాలో ఉద్యోగులు పంచుకుంటున్న ఆందోళనలను హెచ్చరిక సంకేతాలుగా భావించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ, తమ వంతుగా ఇలాంటి అంశాలను గమనిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.

