కలం, కరీంనగర్ బ్యూరో : రాజకీయాలను పక్కనపెట్టి నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం కలిసి పనిచేయడం వల్లే చొప్పదండికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. అభివృద్ధి పనుల కొనసాగింపులో భాగంగా రూ.50 కోట్లతో ఆర్నకొండ నుండి మల్యాల వరకు 35 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి ఈ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఆర్ఐఎఫ్ నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే చుట్టుపక్కల మండలాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఇది అత్యంత సమీప మార్గం కాబోతుందని పేర్కొన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు గడువు విధించినట్లు చెప్పారు.
ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే రవాణా సౌకర్యాలు బాగుండాలని, అందుకే తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి రోడ్ల నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసమే 7 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రూ.2,147 కోట్లతో కరీంనగర్-వరంగల్, రూ.578 కోట్లతో ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన కరీంనగర్-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను కూడా రూ.2 వేల కోట్ల నిధులతో అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Read Also: రేవంత్కు హరీశ్రావు లేఖ.. కేసీఆర్కు కొత్త చిక్కులు!
Read Also: డిజిటల్ విప్లవం

