కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా అంతర్గత విభేదాలతో వార్తల్లో నిలిచిన కీలక నేతలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay), బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చొరవతో ఇద్దరు నేతలు విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ (Laxman) నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ జాతీయ నాయకుడు అభయ్ పాటిల్ మధ్యవర్తిత్వం వహిస్తూ బండి సంజయ్, ఈటల రాజేందర్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ (Telangana BJP) భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
సమావేశం అనంతరం ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, బండి సంజయ్, ఈటల రాజేందర్ల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా ముగిశాయని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.
భేటీ అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్ పరస్పరం ఆలింగనం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవనే సంకేతాన్ని ఇద్దరు నేతలు పార్టీ శ్రేణులకు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో ఈ పరిణామం కీలకంగా మారిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

