కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో మొట్టమొదటిసారి ఓ సినిమాకు క్లాప్ పడింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా NBK 112 అనే వర్కింగ్ టైటిల్తో రూపు దిద్దుకుంటున్న సినిమా రాజధానిలో పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ (Nara Lokesh) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అలాగే బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన సినిమా అమరావతిలో పూజా కార్యక్రమాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సినిమా పరిశ్రమతో టూరిజం ముడిపడి ఉంటుందని చెప్పారు. ఏపీలో ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయ్యిందన్నారు. భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు విజయవాడ ప్రధాన కేంద్రం కాబోతోందని చెప్పారు. బాలకృష్ణ స్టైల్, యాక్షన్కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. ఆయనతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. బాలకృష్ణ నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికతతో ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో అమరావతి మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పారు. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఏపీలోనే షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

