కలం, నల్లగొండ బ్యూరో : ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలను, బలవంతపు మత మార్పిడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం పట్టణంలోని ప్రధాన కూడలి అయిన గడియారం సెంటర్ వద్ద ఆయా సంస్థల నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ కట్ట సూర్య సంపత్, బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న ‘లవ్ జిహాద్’ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో అమాయక యువతులను వంచించి, బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మతమార్పిడి నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. హిందూ అమ్మాయిల రక్షణ కోసం తాము నిరంతరం ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు. యువతులు, ముఖ్యంగా విద్యార్థినులు అపరిచితుల మాయమాటలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, మహిళలపై వేధింపులకు పాల్పడే శక్తులను ఎండగట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ నరసింహ, జూకురి సంపత్, బల్లెం యాదగిరి, రాయల కృష్ణయ్య, ప్రకాశ్ రెడ్డి, రామకృష్ణ, విజయ్, గడ్డం శంకర్, ప్రభాకర్, హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాళ్లు చింతకాయల రేఖ, రజిత రెడ్డి, దేవి, స్వాతి, పద్మ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. గడియారం సెంటర్ వద్ద జరిగిన ఈ ఆందోళనతో పట్టణంలో (Nalgonda) కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
Read Also: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం : ‘బిల్లు’పై కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

