కలం, స్పోర్ట్స్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో భారత్–పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మ్యాచ్ ఎప్పుడూ తీవ్ర ఉత్కంఠతో ఉంటుందని బాబర్ తెలిపారు. రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ను చూస్తుంటుందని, అందుకే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయని చెప్పారు. గత మ్యాచ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, మైదానంలో ప్రశాంతంగా ఉండటం, బయట శబ్దాలకన్నా ఆటపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో భారత్పై బహుళ జాతీయ టోర్నీల్లో పాకిస్థాన్ (IND vs PAK) రికార్డు ఆశించిన స్థాయిలో లేదన్న విషయాన్ని కూడా బాబర్ గుర్తుచేశారు. అయినా, ఒత్తిడిని పక్కనపెట్టి రిలాక్స్డ్ మైండ్సెట్తో ఆడితే ఫలితం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వరల్డ్ కప్కు ముందు టీ20ల్లో బాబర్ ఫామ్ ప్రశ్నార్థకంగా మారింది. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన సమయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్లో నెదర్లాండ్స్పై 46 పరుగులతో తిరిగి లయ అందుకున్నారు. ఆ తర్వాత యూఎస్ఏతో మ్యాచ్లో 15 పరుగులకే ఔట్ కావడంతో స్థిరత్వంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆదివారం జరగనున్న గ్రూప్–ఏ మ్యాచ్ మరింత కీలకంగా మారింది. ఈ పోరులో గెలిచిన జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఎయిట్స్కు నేరుగా చేరనుంది. ప్రస్తుతం భారత్ నాలుగు పాయింట్లతో మెరుగైన నెట్ రన్రేట్తో అగ్రస్థానంలో ఉండగా, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ కూడా నాలుగు పాయింట్లతోనే ఉన్నా నెట్ రన్రేట్లో వెనుకబడి ఉంది.
Read Also: ఆర్ఆర్ఆర్ను మించి.. రాజమౌళి హాలీవుడ్ ప్లాన్స్, అంతర్జాతీయ స్థాయిలో వారణాసి
Follow Us On: X(Twitter)


