కలం, వెబ్ డెస్క్: 2007లో హత్యకు గురైన అయేషా మీరా (Ayesha Meera) అవశేషాలను నేడు సీబీఐ అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆమె అవశేషాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీబీఐ కోర్టు వద్ద అయేషా మీరా తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ రోజు ఉదయమే అయేషా తల్లిదండ్రులు విజయవాడ సీబీఐ కోర్టు కాంప్లెక్స్కు చేరుకున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూసినా తమ బిడ్డకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టు కూడా చేతులెత్తేసి ఆధారాలు లేవనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అయేషా తల్లిదండ్రులకు మద్దతుగా కోర్టు వద్ద ప్రజా సంఘాలు, న్యాయ పోరాట కమిటీ నిరసన తెలిపారు. అయేశా తల్లిదండ్రులకు అవశేషాలు అప్పగించిన తర్వాత సీబీఐ కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు.
అసలు ఏం జరిగిందంటే..
2007లో విజయవాడలోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అయేషా మీరా డిసెంబర్ 27న హాస్టల్ బాత్రూంలో హత్యకు గురైంది. అక్కడే ఓ లేఖ లభించింది. అయేషాను ప్రేమించానని, ఒప్పుకోకపోవడంతో హత్య చేశానని ఆ లేఖలో గుర్తు తెలియని వ్యక్తం రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సత్యం బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష కూడా వేసింది. కానీ, తర్వాత సత్యం బాబును దోషిగా తేలుస్తూ విడుదల చేసింది. ఆ తర్వాత 2018లో ఈ కేసు సీబీఐ చెంతకు చేరింది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. దీంతో తమ బిడ్డ అవశేషాలు అప్పగించాలని అయేషా తల్లిదండ్రులు కోర్టును కోరడం, అవశేషాలు అప్పగించడంతో నేడు ఆ అంత్యక్రియలు చేపట్టారు.

