కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై ఉన్న అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ చార్జ్ షీట్లో మెరిట్ లేదని కోర్ట్ అభిప్రాయపడింది. నిందితులపై ఆధారాలు లేకుండా చార్జ్ షీట్ రూపొందించారని సీబీఐని విమర్శించింది. ఈ సందర్భంగా అర్వింద్ కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. మోడీ, అమిత్ షా తనపై కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తాను, మనీష్ సిసోడియా నిజాయితీపరులని కోర్టు తేల్చిందని, చివరికి న్యాయమే గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ పాలసీపై కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై సీబీఐ దర్యాప్తు చేసి చాలా మందిని అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది.

