కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ (Nizamabad) లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సహాయ ఉపకరణాల (Assistive Devices) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఆటో, వీల్చైర్స్ వంటి పలు సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని అత్యంత ప్రాముఖ్యతగా తీసుకుంటోందని వెల్లడించారు. వారికి ఉపాధి అవకాశాలు, సదుపాయాలు కల్పించడం ద్వారా స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటుంది. బలహీన వర్గాల అభివృద్ధి లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు అందిస్తున్న ఈ సహాయ ఉపకరణాలు వారి రోజువారీ జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, నగర మేయర్ ఉమారాణి, ఇతర ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు.

