కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ స్విమ్మింగ్ (Asian Games Swimming) పోటీల్లో భారత అథ్లెట్లకు ఆదివారం తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత స్విమ్మర్ రిషభ్ దాస్ (Rishabh Das) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పోరులో ఆయన 54.77 సెకన్ల టైమింగ్ నమోదు చేసి పతక అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చైనాకు చెందిన జియాయు జు 51.98 సెకన్లతో స్వర్ణం సాధించగా, జపాన్ క్రీడాకారుడు హిదేకాజు టకెహారా రజతం, దక్షిణ కొరియాకు చెందిన జుహో లీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన హీట్స్లో రిషభ్ దాస్ 54.85 సెకన్లలో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ అర్హత సాధించాడు.
అయితే మరో భారత స్విమ్మర్ ఉత్కర్ష్ పాటిల్ 56.19 సెకన్లతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్ రేసు నుంచి వైదొలిగాడు. అలాగే 100 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్లో రోహిత్ బెనెడిక్టన్ 12వ స్థానంలో, ఆకాశ్ మణి 23వ స్థానంలో నిలిచి వెనుదిరిగారు. రిషభ్ దాస్ సోమవారం జరగబోయే 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ తో పాటు 4×100 మీటర్ల మెడ్లే రిలేలోనూ పోటీపడనున్నాడు. 2014 తర్వాత ఆసియా గేమ్స్ స్విమ్మింగ్లో పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్కు సోమవారం జరగనున్న రేసులు ఎంతో కీలకంగా మారాయి.

