కలం, వెబ్ డెస్క్: భారతీయ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) (Asha Bhosle) గుండెపోటుకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఆమెకు గుండెపోటు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆశా భోస్లేను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆమెకు చికిత్స జరుగుతోంది. ప్రముఖ వైద్యుడు ప్రతి సంధానీ పర్యవేక్షణలో ఆశా భోస్లే చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆశా భోస్లే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ వార్త తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా, దివంగత గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే తనదైన గాత్రంతో విశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1950వ దశకంలో తన మ్యూజిక్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె దాదాపు 800లకు పైగా చిత్రాల్లో 12వేలకు పైచిలుకు పాటలు పాడారు. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” ,“సాథీ హాత్ బధానా” వంటి పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడిన “యే మేరా దిల్” , “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” వంటి డ్యాన్స్ నంబర్లతో ఆమె సంచలనం సృష్టించారు.

