కలం, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ, న్యాయవాదితో గానీ విచారణకు హాజరు కాబోనని స్పష్టం చేశారు. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేస్తానని ప్రకటించారు. ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి నుంచి తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందని, అందుకే గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అంతకుముందు జస్టిస్ స్వర్ణకాంత శర్మ పిల్లలు కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్గా ఉండటం వల్ల ఆమె ఈ కేసు నుండి తప్పుకోవాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తులు తప్పుకుంటే అది వ్యవస్థ బలహీనతకు నిదర్శనం అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు ఈ కేసులో కేజ్రీవాల్ను నిర్దోషిగా విడుదల చేయగా, దానిని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది.

