కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ (AP Weather) పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు భగభగ మండుతూ తీవ్ర ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వలన బుధవారం అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో పలు మండలాల్లో తీవ్ర ఉక్కపోత కూడా ఉండనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు 24 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఎండ వేడి దృష్ట్యా మధ్యాహ్నం వేళ వీలైనంతవరకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని సూచించింది.

