కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గద్దర్ అవార్డుల వేడుక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ అవార్డుల ప్రదానోత్సవం హైలెట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి వివిధ ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీ సర్కారు సినీ రంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ నటుడు చిరంజీవి వేదిక విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఏపీ ప్రభుత్వం కూడా సినీరంగాన్ని ప్రోత్సహించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వయంగా నటుడైన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ సినీ రంగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సినీ అటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ త్వరలో నంది అవార్డుల (Nandi Awards)ను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఏపీలో ఇప్పటికే కవులు, కళాకారులను ఎంతో గౌరవించుకుంటున్నామన్నారు. ఉగాది సందర్భంగా పురస్కారాలు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా అవార్డులకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

