కలం వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సభకు అనుమతించకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పవన్ తీరుపై విమర్శలు చేయడంపై ఏపీ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) స్పందించారు. పొన్నం వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో పుట్టిన పవన్ కల్యాణ్కు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ప్రకారం ఈ దేశంలో జన్మించని సోనియా గాంధీ, ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో పుట్టిన ఖర్గేలకు కూడా తెలంగాణలోకి వచ్చే అర్హత లేదంటావా అంటూ ప్రశ్నలు సంధించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపైనా విష్ణు వర్ధన్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగం అమలవుతుందా? లేక కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగం అమలవుతుందా? అని ప్రశ్నించారు.

