కలం, వెబ్ డెస్క్: వంగవీటి మోహన రంగా (Vangaveeti Ranga)ను పోలీసుల సహకారంతో టీడీపీ (TDP) గూండాలే హతమార్చారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. విశాఖలో నేడు వైసీపీ కాపు నేతల సమావేశంనిర్వహించారు. ఈ సమావేశం అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగిందని చెప్పారు. దీనికి పోలీసులే సహాయం చేశారన్నారు. ఈ విషయం ఈ కాలం యువతకు తెలియకపోవచ్చన్నారు. రంగా హత్యకు ముందు పోలీసులు ఆయన గుడారాన్ని చెక్ చేశారని తెలిపారు. దాడి గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని, దాడి జరిగితే ఎదురుదాడి చేసేందుకు ఏమైనా ఆయుధాలున్నాయా అనేది తెలుసుకునేందుకు చెక్ చేశారని ఆరోపించారు. ఇటీవల కూడా పోలీసుల సహకారంతోనే తనపై దాడి చేశారని చెప్పారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం ఎందుకు ఉద్యమ బాట పట్టారని ప్రశ్నించారు. ఈ ఘటనలన్నింటికీ కారణం చంద్రబాబే అని, ఇలాంటి దుర్మార్గపు విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

