కలం, వెబ్డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda)లో జరిగిన ఓ హత్య కేసు (Murder Case)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడి భార్యే హత్య చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు మద్యం సీసా మూత ఆధారంగా మారడం ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే. ఆళ్లగడ్డ(Allagadda )కు చెందిన ఆంజనేయులు, సుబ్బులు భార్యాభర్తలు. సుబ్బులు కొంత కాలం నుంచి గురుప్రసాద్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు.
గురు ప్రసాద్ కొద్ది రోజుల క్రితం పట్టణ శివారులోని పొలాల్లో ఆంజనేయులకు మద్యం తాగించాడు. అతడు మత్తులోకి జారుకోగానే గురుప్రసాద్ మరో నిందితుడు షరీఫ్తో ఆంజనేయులు తలపై మద్యం సీసా, బండరాయితో తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్పై పరారయ్యారు. మృతుడి భార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముందు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలానికి వెళ్లి ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన పగిలిన మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ ఈ కేసును ఛేదించడంలో కీలకంగా మారింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన పోలీసులు, ఆ మద్యం సీసాను ఏ వైన్ షాప్లో కొనుగోలు చేశారో సాంకేతికత సహాయంతో గుర్తించారు. వెంటనే ఆ షాప్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజ్ను పరిశీలించారు. అందులో నిందితులు మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే పోలీసులు టెక్నికల్ క్లూస్ ద్వారా ఈ కేసును చేధించారు. మృతుడి భార్య సుబ్బులతో పాటు ఆమె ప్రియుడు గురుప్రసాద్, మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Also Read : నేడు ఏపీ కేబినెట్ భేటీ: కీలక ప్రతిపాదనలకు అవకాశం!
Follow Us On: X(Twitter)

