కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నమైన విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేసిన 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సెప్టెంబరు 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. మంగళవారం న్యూఢిల్లీ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ఆవశ్యకతను, స్థానికుల దీర్ఘకాలిక ఆకాంక్షలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో ప్రతిపాదించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాల వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకొని కొత్తగా 4-5 ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తుమ్మల (Minister Tummala) వివరించారు. ఈ ప్రదేశాల్లో రన్వే నిర్మాణానికి అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూసేకరణ సౌలభ్యం వంటి కీలక అంశాలపై కేంద్ర సాంకేతిక బృందం అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. సాంకేతిక బృందం నివేదిక సానుకూలంగా వచ్చిన వెంటనే, విమానాశ్రయం ఏర్పాటుకు తక్షణమే తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో చర్చించనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వస్తే భద్రాద్రి గగనతలంలో త్వరలోనే విమానాల రాకపోకలు షురూ అవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ.. కేబినెట్ మార్పుపై కీలక చర్చ..!
Follow Us On: Instagram

