కలం, వెబ్ డెస్క్: లోకసభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో భారీ నిరసన ర్యాలీ (Congress Protest Rally) నిర్వహించింది. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కేంద్రం తీరుకు నిరసనగా ర్యాలీ చేసింది. ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ సలహాదారు విహెచ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న హల్ద్వానీ ర్యాలీ వేదిక వద్ద బీజేపీ–ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అత్యంత హేయమైన “శుద్ధీకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారని, దీనిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు.
అలా చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వేదికను శుద్ధి చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు. తమ నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. మనువాద సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వేదికను శుద్ధి చేయడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు తలవంపులు తెచ్చే చర్య అని పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గేని అవమానించే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

