కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు (Singur Canal) ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రభుత్వ అలసత్వం సింగూరు అయకట్టు రైతులను అగం చేస్తుంది. పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో ప్రాజెక్టు నుంచి అయకట్టుకు నీటిపారుదలకు ప్రదానమైన కాలువల లైనింగ్ పనులు పూర్తికాలేదు. ఇప్పటికే క్రాప్ హలీడేతో నష్టపోయిన అందోల్ ప్రాంత రైతులు ప్రాజెక్టు మరమ్మత్తులు, కాలువల లైనింగ్ పనులు అలస్యంగా జరుగుతుండటంతో దిక్కుదోచని స్థితిలో ఉన్నారు.
కాంట్రాక్టర్ మార్పు
ప్రాజెక్టు భద్రతపై రిపోర్టు రావడంతో డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఇచ్చిన నివేదిక మేరకే సింగూరుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్యాం సేఫ్టీ అధికారుల హెచ్చరికలతో దెబ్బతిన్న సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ మరమ్మతులు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో సింగూరు సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేయడానికి రూ. 168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఓ కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకుని మొదటగా కెనాల్స్ లైనింగ్ పనులను ప్రారంభించారు. అయితే సదరు కాంట్రాక్టర్ గతేడాది కాలువకు బ్రష్ కటింగ్ అంటే కాలువలకు ఇరు వైపులా ఉన్న చెట్లని తొలగించడం మాత్రమే చేశారు. తర్వాత సదరు కాంట్రాక్టర్ సిమెంట్ పనులను ప్రారంభించకపోవడంతో నీటి పారుదల శాఖ అధికారులు ఆ కాంట్రాక్టర్ని మార్చారు. ఈ ఏడాది మరో కాంట్రాక్టర్కి కాలువల లైనింగ్ పనులు అప్పగించారు. కొత్తగా వచ్చిన ఈ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి నెలకు ఓ కిలోమీటర్ చొప్పున కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తు వస్తున్నాడు.
టార్గెట్ జూన్ 26.. అయినా పూర్తి కాని పనులు
ఈ మార్చిలో సింగూరు ప్రాజెక్టు మరమత్ములు, కాలువల లైనింగ్ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో నిర్ణయించిన మొత్తం 13 కిలోమీటర్ల కాలువ లైనింగ్ పనుల్లో ఇప్పటికే 9 కిలోమీటర్ల మేర పనులు విజయవంతంగా పూర్తయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. ప్రాజెక్టు కాలువ లైనింగ్ పనుల్లో మిగిలిన 4 కిలోమీటర్ల పనులను పూర్తి చేయల్సి ఉందని తెలిపారు . మిగిలిపోయి ఉన్న ఈ పనులన్నింటినీ 2026 జూన్ 26వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. గడుపు ముగిసి దాదాపు నెలలు గడుస్తన్నా.. సింగూర్ ప్రాజెక్టు కింద చేపట్టిన కాలువ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల, అధికారుల నిర్లక్ష్యంతో మిగిలిన కాలువల లైనింగ్ పనుల్లో తీవ్రం జాప్యం జరుగుతుంది.
ఇసుక కొరత పేరుతో..
అలస్యంగా అయిన కాలువల లైనింగ్ పనులు ఊపందుకుంటయనేలోపే ఇప్పుడు సింగూరు కాలువ పనులకు మరో సమస్య వచ్చిపడింది. ప్రాజెక్టు కాల్వల పనులు ఇసుక లేదనే కారణంతో నెలన్నర రోజులుగా పనులు నిలిపివేశారు. మిగిలిన పోయిన నాలుగు కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ పనులు ఆగిపోయాయి. ఇసుక కొరత వంకతో కాంట్రాక్టర్ పనులను ఆపేయడంతో ఎక్కడికక్కడ పనులు మధ్యలోనే అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిర్ణీత గడుపులోపు కాలువల లైనింగ్ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరో వైపు సింగూరు కాలువ లైనింగ్ పనులు నిలిచిపొవడం పై అందోల్ నియోజకవర్గ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి కాలువలను అందుబాటులోకి తెస్తారేమోనని మేం ఆశిస్తుంటే, ఇసుక లేదనే కారణంతోనో, మరో కారణంతోను పనులను నిలిపివేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి హెచ్చరించినా..
వానాకాలం అయిపోయే లోపు పనులు పూర్తి చేయకపోతే రైతులు మరో సాగుకు దూరం అయ్యే ఆస్కారం ఉంది. సింగూరు కాలువల పనుల ఆలస్యంపై ఇప్పటికే పలుమార్లు స్ధానిక ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులు, కాంట్రాక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ లైనింగ్ పనులు నిలిచిపోకుండా ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్ ఇసుక కొరత రాకుండా, చూసుకుంటూ తిరిగి పనులు ప్రారంభించి, నిర్ణీత గడుపులోపు నాణ్యతతో కూడిన కాలువ పనులు పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
ఇబ్బందుల్లో సింగూరు రైతులు
సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ప్రాజెక్టులో నిల్వ ఉన్న 15 టీఎంసీని కిందికి వదిలింది. సింగూరు మరమ్మతుల కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసినప్పటీ నుంచి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సింగూరు ప్రాజెక్టు కింద కాలువల ద్వార సాగవుతున్న 40 వేల ఎకరాలకు ఈ కాల్వల సిమెంట్ లైనింగ్ పనులు ఏకకాలంలో చేయడానికి ఆయకట్టుకు క్రాప్ హలిడే ప్రకటించారు. ఏడాదిగా క్రాప్ హలీడే ప్రకటిస్తునే ఉన్నారు. దీని వల్ల ప్రాజెక్టుపై ఆధారపడి ఏడాదికి రెండు పంటలు పండించిన రైతులు.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. పనుల కోసం ప్రాజెక్టులోని 15 టీఎంసీల నీటిని డిసెంబర్లోనే ఖాళీ చేయడంతో, అటు యాసంగి, ఇటు ప్రస్తుత ఖరీఫ్ వానాకాలం, వచ్చే రబీ సీజన్లలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దానికి తోడు ప్రాజెక్టు నుంచి అయకట్టుకు సాగునీరు అందించే కుడి, ఎడమ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు అలస్యం అవుతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే క్రాఫ్ హాలీడేతో పంటలను కోల్పోయిన రైతులు ఇదే తరహలో పనులు అలస్యంగా జరిగితే మరోసారి పంటలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

