కలం, వెబ్ డెస్క్ : ఎయిరిండియా (Air India ) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దాని తోక భాగం ఒక్కసారిగా రన్వేను తాకడం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.
ఈ ఘటనపై ఎయిరిండియా విమానయాన సంస్థ స్పందించింది. ఈ ఘటన నేపథ్యంలో విమానాన్ని తనిఖీల నిమిత్తం నిలిపివేశామని.. ఢిల్లీకి ఆ విమానం తిరుగు ప్రయాణం రద్దైందని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపిన సంస్థ.. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.

