కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ 2026లో అఫ్ఘానిస్థాన్ ఆటతీరు తీవ్ర నిరాశపరిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా టీ20 అంతర్జాతీయ జట్టు కెప్టెన్ పదవి నుంచి రషీద్ ఖాన్ (Rashid Khan)ను తప్పించి, ఆ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్కు అప్పగించారు. శ్రీలంకతో జరగబోయే వైట్ బాల్ సిరీస్కు ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. జట్టు నిర్వహణలో ఇటీవల జరిగిన మార్పులు, అలాగే కొత్త హెడ్ కోచ్ నియామకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.
అఫ్గానిస్థాన్ (Afghanistan) క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులైమన్ఖిల్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా టీ20 జట్టులో నాయకత్వ మార్పు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జట్టు భవిష్యత్ దిశను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు తీసుకువచ్చినట్లు ఆయన వివరించినట్టు సమాచారం. ఇక టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లను ఈసారి జట్టులోకి తీసుకోలేదు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ ఫజల్హక్ ఫరూకీ, గుల్బదిన్ నయీబ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ ఇషాక్లకు చోటు దక్కలేదు.
మరోవైపు కొంతమంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. టాప్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ నూర్ రెహ్మాన్, ఎడమచేతి స్పిన్ ఆల్రౌండర్ షరఫుద్దిన్ అష్రఫ్, ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ ఫరీద్ అహ్మద్లను టీ20 జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫరీద్ అహ్మద్ మాలిక్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. ఫాస్ట్ బౌలర్ జియా ఉర్ రెహ్మాన్ షరీఫీకి తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది.
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఫాస్ట్ బౌలర్ బిలాల్ సామీ వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనను టీ20 జట్టు రిజర్వ్ జాబితాలో కూడా చేర్చారు. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో అఫ్గానిస్థాన్ జట్టు ఇప్పుడు కొత్త దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంకతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ ఆ జట్టుకు తదుపరి కీలక పరీక్షగా మారనుంది.
Read Also: స్మార్ట్ఫోన్కు అడిక్ట్ అయ్యారా.. అయితే ఈ టెక్నిక్ను ఫాలోకండి!
Follow Us On: Pinterest

