కలం, నిర్మల్: పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అందించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల (Adilabad Police) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షకు భారీ స్పందన లభించింది. మొత్తం 3,446 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ అభ్యర్థులకు నలంద కళాశాల, శ్రీచైతన్య పాఠశాల (మావల), ఉట్నూర్ సబ్ డివిజన్ అభ్యర్థులకు చావర అకాడమీ (మావల)లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి 300 మందిని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవసరమైన ఉచిత శిక్షణ అందించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు.

