కలం, డెస్క్ : నటుడు శివాజీ (Sivaji) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడవారు వేసుకునే బట్టలు వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేవంటూ తెలిపారు. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల బట్టలపై శివాజీ (Sivaji) చేసిన కామెంట్లు ఎంత పెద్ద దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. తన వ్యాఖ్యలపై శివాజీ ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాడు. మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చాడు. తాజాగా ఆ వివాదం మీద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అనే వ్యక్తిని కాదని.. ఆడవారిని తాను ఎంతో గౌరవిస్తానని తెలిపాడు శివాజీ.
‘ఆడవారి బట్టల గురించి మాట్లాడటంలో నా ఉద్దేశం ఏంటో అందరికీ అర్థమైంది. అందుకే చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు. నేను ఎన్నడూ మాట తూలలేదు. ఆ రోజు ఆడవారి బట్టలపై మాట్లాడుతూ నేను రెండు పదాలు దొర్లాను. అవి తప్పు. అలా ఎందుకు మాట్లాడానా అని ఎంతో మానసిక వేదనకు గురయ్యాను. మూడు రోజులు నిద్ర కూడా పోలేదు. ఇప్పటికీ నా కామెంట్ల పట్ల నేను బాధపడుతున్నాను. అనసూయను నేను ఏమీ అనలేదు. ఆమెతో నాకు పరిచయం పెద్దగా లేదు. నా వ్యాఖ్యలను కావాలనే పెద్దవి చేసి చూపెట్టారు. దానికి నేను ఎంతో బాధపడ్డాను. ఆడవారి బట్టలను బట్టి క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేం. అది అందరం గుర్తుపెట్టుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు నటుడు శివాజీ.


