కలం, నల్లగొండ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) నూతన రిజిస్ట్రార్గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి (Koppula Anji Reddy) నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సౌమ్యుడిగా, పరిపాలన దక్షిత, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా మంచి పేరున్న ఆచార్య కొప్పుల అంజిరెడ్డి జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకమని వైస్ ఛాన్సలర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నేటి యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం సింగారం గ్రామానికి చెందిన ఆచార్య కొప్పుల అంజిరెడ్డి విద్యాభ్యాసం.. ప్రాథమిక విద్య స్వగ్రామంలో, అనంతరం మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు చాడా గ్రామంలో, డిగ్రీ వరకు భువనగిరిలో, పీజీ నుండి పీహెచ్డీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొనసాగింది.
దశాబ్ద కాలం పాటు సర్దార్ పటేల్ కళాశాలలో అధ్యాపకుడిగా అనంతరం ఎస్జిటి అధ్యాపకునిగా, 2007లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులుగా విధుల్లో చేరి నేడు రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించడం ప్రశంసనీయం అని అన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ హాస్టల్ వార్డెన్ గా, ఐక్యూఏసీ డైరెక్టర్గా మొట్టమొదట విశ్వవిద్యాలయానికి న్యాక్ గ్రేడింగ్ సాధనలో విశేష కృషి చేశారు.
అనంతరం ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్గా సుదీర్ఘకాలం సేవలు అందించడమే గాక ఆడిట్ సెల్ డైరెక్టర్గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఉప కులపతికి ఓఎస్డిగా సేవలందించి అందరి మన్ననలు పొందారు. విశ్వవిద్యాలయ బాధ్యతలే కాకుండా తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలకు తన వంతు కృషి చేస్తున్నారు. రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కొప్పుల అంజిరెడ్డికి వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్( Khawaja Altaf Hussain), అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

