కలం, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీని ఓడిస్తామని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విజన్ ఇండియా ద్వారా పనిచేస్తున్నామన్నారు. సమాజ్ వాది పార్టీ (Samajwadi Party) అధ్యర్యంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ కు ఆయన హాజరయ్యారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం, భవిష్యత్తులో సాంకేతికత రూపాంతరం వంటి అంశాలపై యువతలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అన్ని ప్రధాన పట్టణాల్లో విజన్ ఇండియా సమ్మిట్ లను నిర్వహిస్తోంది. మొదటి సమ్మిట్ బెంగళూరులో నిర్వహించగా.. రెండో సమ్మిట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
సమావేశం అనంతరం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) మీడియాతో మాట్లాడారు. రైతులకు, మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణీకరణ, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ఆరోగ్య, తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై సమ్మిట్ లో నిపుణులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని వివరించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని(AI Technology) ఉపయోగించి నేరాలను కట్టడి చేయాలన్నారు. మానవులకు సరైన దృక్పథాన్ని, సానుకూల ఆలోచనలు కలిగించేలా భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం యూపీలో సుమారు 3 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అనేక ఓట్లు పోతున్నాయన్నారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గెలవడానికే బీజేపీ ఎస్ఐఆర్ చేపడుతోందని ఆరోపించారు. ఇది ఎస్ఐఆర్ కాదని, ఇది జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియ అని విమర్శించారు. ఎన్ఆర్సీని నేరుగా చేపట్టలేక ప్రభుత్వం ఎస్ఐఆర్ ను వాడుకుంటున్నదన్నారు. ఎన్ఆర్సీకి ఎన్ని పత్రాలు అడుగుతారో ఎస్ఐఆర్ కి అన్ని పత్రాలు అడుగుతున్నారని చెప్పారు. బూత్ స్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వలేదని, దీంతో క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత, కానీ ఓట్లు తొలగించడం కాదని స్పష్టం చేశారు. అలాగే తాము ఇండియా కూటమిలోనే కొనసాగుతామని అఖిలేష్ యాదవ్ పునరుద్ఘాటించారు.
Read Also: స్పెషల్ ఫ్లైట్ లో రాత్రికి రాత్రే ఢిల్లీకి రాహుల్, రేవంత్… ఆంతర్యమేంటి?
Follow Us On: Youtube


