ఖమ్మం(Khammam) నగర కిరీటంలో మరో కలికితురాయి చేరనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఖమ్మంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటికి అదనంగా మున్నేరు నది(Munneru River)పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, రిటైనింగ్ వాల్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా మూడు నెలల్లో పూర్తి అవుతాయన్నారు. నూతన టెక్నాలజీతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగాలని, హైదరాబాద్ దుర్గం చెరువు, కరీంనగర్ మానేరు నదిపై గతంలో కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయని, రాష్ట్రంలో 3వ కేబుల్ బ్రిడ్జి ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతుందని, కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైన పవర్ లైన్స్, విద్యుత్ స్తంభాల తరలింపు పనులు 15 రోజులలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ నడుస్తుందని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్నేరు నదిపై రిటైనింగ్వాల్ నిర్మాణానికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మొదటి ప్రాధాన్యతగా, కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు రెండవ ప్రాధాన్యతగా పెండింగ్ భూ సేకరణ త్వరగా క్లియర్ చేయాలని మంత్రి తెలిపారు. మున్నేరు నదికి ఇరు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం భూముల బదలాయింపు కోసం అడ్వాన్స్ పోజిషన్ వెంటనే అందించాలని సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను మంత్రి ఫోన్ లో ఆదేశించారు. మార్చి 2026 నాటికి మున్నేరు నది రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని, సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి పైప్ లైన్, పవర్ లైన్ తరలింపు పనులు సమాంతరంగా జరగాలన్నారు. కేబుల్ బ్రిడ్జిపై లైటింగ్ అద్భుతంగా ఉండేలా చూడాలని, రాష్ట్రంలో 3 కేబుల్ బ్రిడ్జిలలో మన కేబుల్ బ్రిడ్జి ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని, దీనికి సంబంధించి అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని తెలిపారు.
ఖమ్మం(Khammam) నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్.టి.పి. నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలను ఒప్పించి భూ సేకరణ పూర్తి చేసి సంబంధిత ఏజేన్సీలకు త్వరగా భూమి అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్అండ్బి ఎస్ఈ యాకోబు, విద్యుత్ ఎస్ఈ, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: వాయిదాలు కట్టకుంటే ఎన్పీఏ ప్రకటిస్తాం : ఆర్ఈసీ
Follow Us On: X(Twitter)


