కలం, వెబ్ డెస్క్: ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత్ ఫీల్డింగ్లో అదరగొడుతోంది. మూడు అద్భుత క్యాచ్లు అందుకుంది. ఈ మూడింటిలోనూ అక్షర్(Axar Patel) భాగస్వామ్యం ఉండడం విశేషం. ఈ క్రమంలో విల్ జాక్స్ క్యాచ్ను అక్షర్ అందుకున్న తీరు వహ్వా అనిపించింది. 254 పరుగుల భారీ ఛేదనలో నిలకడగా ఆడుతున్న విల్ జాక్స్ (35) ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేయగా, ఆ వికెట్ దక్కడంలో అక్షర్ పటేల్ చూపిన సమయస్ఫూర్తి హైలెట్గా నిలిచింది.
అర్ష్దీప్ వేసిన లో-ఫుల్ టాస్ బంతిని విల్ జాక్స్ డీప్ కవర్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి సిక్సర్గా వెళ్తుందనుకున్న తరుణంలో అక్షర్ పటేల్(Axar Patel) గాలిలోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. అయితే, బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ దాటుతున్నానని గ్రహించిన అక్షర్, వెంటనే బంతిని గాలిలోకి విసిరాడు. అక్కడే ఉన్న శివం దూబే ఆ బంతిని అందుకోవడంతో విల్ జాక్స్ పెవిలియన్ చేరక తప్పలేదు. విల్ జాక్స్ ఇన్నింగ్స్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. జాక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లండ్ 14 ఓవర్లలో 172/5 స్కోరుతో ఉంది. అర్ష్దీప్ సింగ్ 3 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

