కలం, వెబ్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్యసభకు సీటు కోసం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నానని నితీశ్ స్వయంగా ప్రకటించారు. అయితే నితీశ్ రాజ్యసభకు నామినేషన్ వేయడం వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు వస్తున్నాయి. బీహార్ రాష్ట్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కాషాయపార్టీ ఈ ఎత్తుగడ వేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను బీజేపీ కంట్రోల్ చేస్తోందని.. ఆయా పార్టీల అధినేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీహార్ ప్రజలు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ను ఎన్నుకున్నప్పటికీ బీజేపీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఠాకూర్ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ, తుది నిర్ణయాలు బీజేపీ తీసుకుందని చెప్పారు. కూటమి భాగస్వాములు పరిస్థితులకు తలొగ్గి పనిచేయాల్సి వస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కూటమి రాజకీయాలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఠాకూర్ (Manickam Tagore) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న చర్చ సాగుతోంది. అయితే ఏపీలో టీడీపీకి మిత్రపక్షాలను కలుపుకోకపోయినా స్పష్టమైన మెజార్టీ ఉంది. దీంతో ఏపీలో ఆ పరిస్థితి రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ బీజేపీ వ్యూహాలు ఎంతో అనూహ్యంగా ఉంటాయి. మరి బీజేపీ ఏపీ విషయంలో ఎటువంటి వ్యూహం అవలంభించబోతున్నది. బీహార్ లాగానే ఇక్కడ కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అన్నది వేచి చూడాలి.
Read Also: శతకం అంచులో ఆగిన సంజూ శాంసన్.. 89 పరుగుల వద్ద ఔట్
Follow Us On : WhatsApp

